మహిళా రత్నము – రుక్మిణి దేవి అరండేల్

          ఫిబ్రవరి 29, 1904లో మదురై లోని ఒక బ్రాహ్మణ కుటుంబములో నీలకంఠ శాస్త్రి, శేషమ్మల్ దంపతులకు రుక్మిణి దేవి జన్మించింది తండ్రి సంస్కృత పండితుడు, చరిత్రకారుడు అంతే కాకుండా మద్రాసులో గల థియోసాఫికల్ సొసైటీలో సభ్యుడు ఆ సిద్ధాంతాల పట్ల పూర్తి నమ్మకము కలిగినవాడు. కాబట్టి చిన్నప్పటినుండి రుక్మిణి దేవి కూడా థియోసాఫికల్ సొసైటి వారి మానవత్వపు విలువల పట్ల ఆకర్షితురాలైంది. తండ్రి ప్రభావము మాత్రమే కాకుండా ఈవిడపై థియోసాఫికల్ సొసైటీ సహా వ్యవస్థాపకురాలు, మహిళా హక్కుల ఉద్యమములో చురుకుగా పాల్గొనే వ్యక్తి, ఆనాడు జరుగుతున్నా జాతీయోద్యమములో కార్యకర్త అయిన అనీబిసెంట్ ప్రభావము కూడా చాలా ఉంది. 16 ఏళ్ల  వయస్సులో రుక్మిణి దేవి, అనిబిసెంట్  ముఖ్య అనుచరుడు, విద్యావేత్త అయినా జార్జి అరండేల్ ను కలిసి ఆయనను ప్రేమించి 1920లో వివాహమాడింది. అప్పటినుంచి ఆవిడా రుక్మిణి దేవి ఆరెండేల్ గా లోకానికి  పరిచయము అయింది. వివాహము అయినాక భర్తతో అనిబిసెంట్ తో థియోసాఫికల్  సొసైటీ తరుఫున ప్రపంచ దేశాలలో పర్యటించింది.           ఈ సమయములోనే రుక్మిణీదేవికి క్లాసికల్ డ్యాన్స్ పట్ల ఆసక్తి పెరిగింది. ఆస్ట్రేలియా పర్యటన సందర్భముగా ఆవిడా ప్రయాణిస్తున్న నౌకలో ప్రఖ్యాత బాలేరినా నృత్యకారిణి అన్నాపావ్లోవ్ తో పరిచయము అయి ఆవిడ  నృత్యాభినయానికి ముగ్దురాలైంది. పావ్లోవా కోరిక మేరకు రుక్మిణి దేవి బ్యాలెట్  నేర్చుకోవటం మొదలు పెట్టింది. అంతేకాకుండా పావ్లోవ రుక్మిణి దేవిని ఇతర భారతీయ నృత్య రీతులను నేర్చుకొనేటట్లు ప్రేరేపించింది. ఈ విధముగా రుక్మిణి దేవి భరత నాట్యము నేర్చుకొని భరత నాట్యాన్నిఇతర శాస్త్రీయ నృత్య రీతులను వృద్ధిచేయాలని సంకల్పించింది. ఈ నృత్య రీతులను పునరుద్దరించటమే కాకుండా వాటితో ముడిపడి ఉన్నసాంఘిక పరమైన కొన్నిదురభిప్రాయాలను అలవాట్లను తొలగించటానికి కృషి ప్రారంభించింది. ఆ రోజుల్లో చాలా మంది భారతీయ మహిళలకు భరతనాట్యము అభ్యసించటము నిషేధము భరత నాట్యము ను దేవదాసీలు మాత్రమే నేర్చుకోవాలి అన్ననియమము ఉండేది.దేవదాసీలు వారి జీవితము అంతా పెళ్లిళ్లు లేకుండా దేవాలయాలలో నృత్యము చేయాలి. అటువంటి రోజుల్లో సాంఘిక దురాచారాలను వ్యతిరేకిస్తూ భరతనాట్యాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లిన ధీర వనితా రుక్మిణి దేవి అరండేల్. నాట్యాచార్యుడు  పందనల్లుర్ మీనాక్షి సుందరము పిళ్లే వద్ద భారతనాట్యములో పూర్తి శిక్షణ తీసుకొని మొదటిసారిగా తన నృత్య ప్రదర్శనను రుక్మిణి దేవి 1935 లో థియోసాఫికల్ సొసైటీ స్టేజి మీద ఇచ్చింది. దేవదాసి స్త్రీలే కాకుండా ఇతర భారతీయ స్త్రీలు కూడా భరత నాట్యము నేర్చుకొని ప్రదర్శనలు ఇవ్వవచ్చు అని ప్రజల ముందు తన ప్రదర్శన ద్వారా చూపించింది,1936 జనవరిలో తన భర్తతో కలిసి రుక్మిణి దేవి నృత్యము, సంగీతానికి సంబంధించి కళాక్షేత్రము అనే  ఒక అకాడమీ ని చెన్నైలోని అడయార్ ప్రాంతములో ప్రారంభించారు పురాతన గురుకుల వ్యవస్థ సూత్రాల ఆధారముగా కళాక్షేత్రము ను రూపొందించారు. కళాక్షేత్రములో సీనియర్ సెకండరీ స్కూల్, ఒక హై  స్కూల్, ఒక ఆర్ట్స్ అకాడమి అందులో సంగీతము, నృత్యము నేర్చుకోవటానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ క్లాసు రూములో కాకుండా చెట్ల నీడలో ప్రకృతి వాతావరణములో నేర్చుకునే వీలు కల్పించారు. రుక్మిణి దేవి స్వయముగా ప్రత్యేకమైన సిలబస్ ను రూపొందించి వివిధ భరత నాట్య రూపాలను విద్యార్థినులకు నేర్పారు ఈ నృత్యాలకు అవసరమైన దుస్తులు, నగలు రంగస్థల సీనరీలను కళాత్మకముగా ప్రత్యేక శ్రద్ధతో తయారుచేయించేవారు. వీటికోసము నేత మరియు డైయింగ్ కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. ఈ కేంద్రములో భారతీయ చీరల ను నేయించేవారు. 

           క్రమముగా భారత దేశములో ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన నృత్యకారిణిగా పేరుపొందారు. విభిన్న పురాతన నృత్య రీతులను పునరుద్దరించటంలో ఎనలేని కృషి చేశారు ఈవిడ కృషికి భారత ప్రభుత్వము 1956లో పద్మభూషణ్ బిరుదుతో సత్కరించారు. 1967లో ఈవిడ సంగీత నాటక అకాడమీ అవార్డు ను అందుకున్నారు. సహజముగానే జంతు ప్రేమికురాలు అవటం వల్ల అనిమల్ వెల్ ఫేర్  బోర్డు కు  మొట్టమొదటి అధ్యక్షురాలిగా నియమింపబడ్డారు. ఈ పదవిలో ఉండగానే ఈవిడ ప్రివెన్షన్ ఆఫ్ కృయాలిటీ టు యానిమల్స్ (1952)చట్టము తీసుకురావటంలో ప్రధాన పాత్ర పోషించారు.   

          1977 లో అప్పటి రాష్ట్రపతి  ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ పదవీకాలం ముగియకుండానే స్వర్గుడైనాడు అప్పుడు ఆ పదవికి  ఎన్నుకోవాలి ఆలోచించగా అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ కి రుక్మిణి దేవి అరండేల్ తగిన అభ్యర్థి అని భావించి ఆవిడను రాష్ట్రపతి అభ్యర్థిగా అంగీకరించ వలసినదిగా కోరారు కానీ రుక్మిణి దేవి, ఆ పదవి కి ఉన్నగొప్పతనాన్ని తెలిసి కూడా   చాలా హుందాగా ఆ అభ్యర్ధనను తిరస్కరించారు ఆవిడా దేశాధ్యక్షుడి పదవి కన్నా తన కళాక్షేత్రము బాగోగులు చేసుకోవటమే ముఖ్యమని భావించారు అది ఆవిడకు నృత్యము పట్ల ఉన్న ప్రేమ, అభిమానము కళాక్షేత్రము పట్ల ఆవిడకు గల ఎనలేని బాధ్యత తన అవసరము కళాక్షేత్రనికి ఉన్నది అని గుర్తించి అంతటి అవకాశాన్ని కూడా తృణప్రాయముగా త్యజించింది. అప్పుడే గనుక ఆవిడా ఆ ఆఫర్ కు ఒప్పుకొని ఉంటె మొదటి మహిళా దేశాధ్యక్షురాలిగా చరిత్రలోకి ఎక్కేది ఆ తరువాత ప్రధాని అయినా ఇందిరాగాంధీ చేత ప్రమాణ స్వీకారము చేయించేది అప్పుడు దేశాధ్యక్షురాలు ప్రధాని ఇద్దరు కూడా మహిళలు ఉండేవారు. 

          తన జీవితకాలాన్ని సాంప్రదాయాక భారతీయ కళా రూపాలను పునరుద్దరించటానికి వినియోగించిన మహిళా మణి శ్రీమతి రుక్మిణి దేవి అరండేల్ ఆవిడ  82 సంవత్సరాల వయస్సులో ఫిబ్రవరి 24, 1986లో స్వర్గస్తురాలైనారు. ఆవిధముగా భారత రాష్ట్రపతి అయె అవకాశాన్ని వదులుకున్నా భరత నాట్య ప్రవీణురాలిగా, కళాక్షేత్ర వ్యవస్థాపకు రాలిగా థియోసాఫికల్ సొసైటీలో కీలక సభ్యురాలిగా ప్రసిద్ధి కెక్కారు.